Thursday, August 13, 2015

ఈనాటి కవిత-36 by M.Narayana Sharma Sir

ఈనాటి కవిత-36
____________________________
కృష్ణ మణి -స్పష్టం 

మానవజాతి సాంస్కృతికనిర్మాణంలో సంప్రదాయం,ధర్మం,ఆచారం అనే మూడు పాయలున్నాయి..ధర్మం కొన్ని పరిధులను గీస్తే,సంప్రదాయం,ఆచారాలు ఒక సాంస్కృతిక వారసత్వాన్ని ఇస్తాయి.కొన్ని సార్లు సంప్రదాయాన్ని వదిలిపెట్టినా ఆచారాన్ని వదిలిపెట్టని సమాజాలు ఎప్పటికీ ఉంటాయి.మానవశాస్త్రం ఆచారం(Custom)జీవితం తన ఉనికిలో సుదీర్ఘంగా,సమైక్యంగా సాగిపోవడానికి నిర్దేశించేదని చెప్పింది.చట్టం,ధర్మం అంటూ లేని ఆదిమసమాజాలలోకూడా ఆచారమే చట్టమని మనవశాస్త్రం భావించింది.ఈ ఆచారాలే కొన్నిసార్లు (ఒకరోజు లేదా కొన్ని రోజులు)ఉనికిలోకి రావడంవల్ల స్వీయ సంస్కృతిని అనుభవిస్తాడు.కృష్ణ మణి కవితలో కనిపించేది ఇదే.అధునాతన సౌకర్యాలతో,ఆధునిక హంగులతో రోజూ పరుగుపెట్టే నగరం"బోనాల"రోజుల్లో తనదైన స్వీయ అస్తిత్వాన్ని పొందుతుంది.ఒక పల్లె శోభసంతరించుకుంటుంది.సంస్కృతిలో ఒక సమగ్రపరివర్తనకల సంస్కృతి నమూనా (Cultural pattern) ఉంటుంది.బెనడిక్ట్ తన గ్రంథం "Pattern of Culture" లో ఈ అంశాలను విస్తృతంగా చర్చించాడు.

మానసికంగా కృష్ణమణి కవితలో ఈసందర్భంకోసం ఆరాటం కనిపిస్తుంది.ఇది సంస్కృతి సంబంధమైన మానసిక ప్రేరణత్వం (Psychic impulsive)వల్ల కలుగుతుంది.ఈ చిన్న కవితలో *అస్తిత్వ ప్రకటన *వర్ణన *ఒక చిన్న ముగింపు అనే భాగాలు కనిపిస్తాయి.ఈ ప్రేరణను వ్యక్తం చేయడం మొదటి వాక్యాంశంలోనే కనిపిస్తుంది.

"
పడుతుంది కష్టంగా అడుగు 
అయినా చుట్టూ నా అస్తిత్వ పునాదులే 
నన్ను మేలుకోలుపుతున్నాయి అడగడుగున "

జీవితాన్నించి అవిభాజితమైన సాంస్కృతిక మూలాంశం(Cultural element)ను ఈ వాక్యాలు చెబుతాయి.మనోవైజ్ఞానిక శాస్త్రంలో సాంస్కృతిక సాపేక్షత (Cultural relativity)వ్యక్తిలోని మానసిక స్థాయిని అర్థం చేసుకోవడానికి,అదిసంభవించిన కాలాన్నుంచి ప్రయత్నిస్తుంది.కృష్ణమణిలో ఆకాలం తన బాల్యం.

"
ఇప్పుడు 
ముస్తాబైన కుండలు 
గండ దీపాలు 
ఎందుకో కొత్తగా అనిపిస్తున్నాయి 
అదేదో నేను మల్లి పుట్టినట్లు !"

నోస్టాల్జియాలో -చారిత్రక,సాంస్కృతికాంశాలగురించి చెబుతూ బోయాం(Svetlana Boym) -"Reflective nostalgia is concerned with Historical and individual time-Nostalgia of the first type gravitates toward collective pictorial symbols and oral culture"
(
ప్రతిఫలనాత్మక స్వదేశీప్రేమ-చారిత్రక వైయ్యక్తిక కాలలననుసరించి కలుగుతుంది..మొదటిరకం నోస్టాల్జియా మౌఖికమైన సంస్కృతివైపు,ప్రాక్తన చిత్రాలైన సంకేతాలవైపు చలించి ఆకర్షించబడుతుంది)అన్నారు.కృష్ణ మణి వాక్యాల్లో ఈ ప్రతీకలు కనిపిస్తాయి.

వేప మండల ఊపుడు 
పసుపు భండారి నోసల్లు 
నిమ్మకాయల దండలు 
ఊగిపోవాలనే ఉత్సాహం 
ఆగని ఉద్వేగం 
తీన్మార్ దరువు
లయబద్దంగా డోలు తాళం !
చర్లకోలల వీరంగం 
శూలాల మెరుపు 
కాలి గజ్జెల గలగలలు 
ఆశిర్వచన హస్తాలు 
నన్ను నేను కొత్తగ చూసుకున్నట్లు 
నా చుట్టేదో వైభవం జరుగుతున్నట్లు !

ఇవన్నీ అలాంటి ప్రతీకలే.కృష్ణమణికవిత్వాన్ని "కవిసంగమం"లో మొదటినుంచి గమనిస్తే తానుగా సాధించిన పరిణతి అర్థమౌతుంది.కృష్ణ వస్తువుకు,వ్యక్తీకరనకు,భాషకు ఉండే సంబంధాలను బాగా అర్థం చేసుకున్నాడనే అనాలి..వాక్యాలను ఇచ్చేపద్దతి ఇవన్నీటిలో కృష్ణ సాధన గమనించదగింది..స్పెల్లింగులు రాస్తున్నప్పుడు మళ్ళి,మళ్ళీ గమనించుకోవాల్సిన అవసరం ఉంది.

No comments:

Post a Comment